Cyber Fraud: రూ.360 కోట్ల సైబర్‌ మోసం

దేశంలో మరో భారీ సైబర్ మోసం బయటపడింది. చైనా, హాంకాంక్‌కు చెందిన సైబర్ నేరగాళ్లు.. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం లాభాలను ఆశజూపి  భారతీయుల నుంచి ఏకంగా రూ.360 కోట్లను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు....

Published : 07 Jul 2021 01:26 IST

డెహ్రాడూన్‌: దేశంలో మరో భారీ సైబర్ మోసం బయటపడింది. చైనా, హాంకాంగ్‌లకు చెందిన సైబర్ నేరగాళ్లు.. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం లాభాలను ఆశజూపి  భారతీయుల నుంచి ఏకంగా రూ.360 కోట్లను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఉత్తరాఖండ్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పోలీసుల దర్యాప్తులో ఈ మోసం బయటపడింది. చైనా, హాంకాంగ్ దేశాలకు చెందిన కొందరు సైబర్ నేరగాళ్లు ఓ మొబైల్ యాప్ రూపొందించారు. అందులో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వస్తాయని ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని నమ్మిన భారత్‌కు చెందిన అనేక మంది కోట్లాది రూపాయలను వీరు చెప్పిన ఖాతాలో జమ చేశారు. అలా చేరిన రూ.360 కోట్లను మోసగాళ్లు వివిధ ఆన్‌లైన్‌ మార్గాల ద్వారా చైనాలోని బ్యాంకు ఖాతాలకు మళ్లించారు. అక్కడి నుంచి ఈ సొమ్ము ‘పవర్‌ బ్యాంక్‌’ యాప్‌ ద్వారా క్రిప్టో కరెన్సీలోకి చేరింది. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న మరికొన్ని యాప్‌లను దర్యాప్తు అధికారులు గుర్తించారు. 

హాంకాంగ్‌ నేరగాళ్లకు సహాయం అందించారనే ఆరోపణలతో దేశంలోని ఇ-వ్యాలెట్‌ పేటీఎం, రేజర్‌పే ప్రతినిధులకు ఉత్తరాఖండ్‌ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఉత్తరాఖండ్‌లో ఇద్దరు కీలక నిందితులు సహా బెంగళూరులో నలుగురు, దిల్లీలో ఇద్దరిని అరెస్టు చేసింది. ఈ మోసంలో విదేశీయుల హస్తం ఉండటంతో సీబీఐ, ఐబీ, ఈడీ వంటి జాతీయ సంస్థలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి. అవసరమైతే అంతర్జాతీయ సంస్థల సహాయం కూడా తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని