కరోనా నేర్పిన పాఠాలు  మర్చిపోవద్దు..

కొవిడ్‌-19 లాక్‌డౌన్‌కు ఏడాది గడిచిపోయింది.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ.. ఎంతోమంది ఆర్థిక పరిస్థితిలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ ఏడాది కాలం అందరికీ ఒకేలా లేకపోవచ్చు. కానీ, ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక బలాలు

Updated : 02 Apr 2021 09:33 IST

కొవిడ్‌-19 లాక్‌డౌన్‌కు ఏడాది గడిచిపోయింది.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ.. ఎంతోమంది ఆర్థిక పరిస్థితిలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ ఏడాది కాలం అందరికీ ఒకేలా లేకపోవచ్చు. కానీ, ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక బలాలు, బలహీనతల గురించి మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరాన్ని తెలియజేసింది. ఏదీ మనం అనుకున్నట్లు జరగదు అనేదీ ఈ సమయంలో అర్థం అయ్యింది. మరోసారి ఈ మహమ్మారి విజృంభిస్తున్న వేళ... మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. భౌతిక దూరం.. మాస్కులు ఎంత అవసరమో.. ఆర్థికంగా కొన్ని జాగ్రత్తలూ అంతే ముఖ్యం. మరి, అవేమిటో తెలుసుకుందాం..
అత్యవసరంలో ఆదుకునేలా..
ఉద్యోగాల్లో కోత.. ఆదాయాలు తగ్గడంలాంటి దురదృష్టకరమైన సంఘటనలు గత 12 నెలలుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఎంతోమంది ఈ ఇబ్బందుల నుంచి కోలుకోనేలేదు. ఇప్పుడు మళ్లీ కరోనా రెండో దశ మొదలయ్యింది. కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలూ విధిస్తున్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా కాస్త స్థిరంగా ఉండేందుకు ప్రయత్నించాల్సిందే. రోజువారీ ఖర్చులకు తోడు.. ముఖ్యమైన ఇతర బాధ్యతలకూ ఉపయోగపడేలా నిధి అందుబాటులో ఉంచుకోవాలి. ఈ అత్యవసర నిధి కనీసం 6-9 నెలల ఖర్చులు, నెలవారీ వాయిదాలు.. బీమా పాలసీల ప్రీమియం చెల్లించడంలాంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటివరకూ మీ దగ్గర ఉన్న మొత్తం గత ఏడాది కాలంలో ఖర్చయిపోతే.. దాన్ని భర్తీ చేసుకునేందుకు ప్రయత్నించాలి. మహమ్మారి తర్వాత మనం ఖర్చు పెట్టే తీరూ మారింది. ఇంకా ఏమైనా వృథా ఖర్చులు ఉంటే.. వాటికి కోత పెట్టి, పొదుపు మొత్తాన్ని పెంచుకోవడం మేలు. మనం ఇప్పటికీ తీవ్ర అనిశ్చితిలోనే ఉన్నామన్న సంగతిని మర్చిపోవద్దు.
బీమా.. ధీమా..
గతంలో ఎన్నడూ లేనట్లుగా.. కరోనా తర్వాత మన జీవితాలు మారిపోయాయి. ప్రపంచమంతా ఏమీ చేయలేని అచేతన స్థితికి వెళ్లిపోయింది. ఇది మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన పాఠమే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి, ఆర్జించే వ్యక్తి తన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేలా తగిన ఏర్పాటు చేయాలి. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. జీవిత బీమాకు సంబంధించినంత వరకూ పూర్తి రక్షణకే పరిమితమయ్యే టర్మ్‌ పాలసీని ఎంచుకోవచ్చు. మీకు ఎంత మొత్తానికి బీమా కావాలో చూసుకొని, ఆ మేరకే పాలసీ తీసుకోండి. అధిక ప్రీమియంతో పాలసీ తీసుకోవడం, ఆ తర్వాత మధ్యలోనే దాన్ని ఆపేయడంలాంటివి మంచిది కాదు. బృంద ఆరోగ్య బీమా పాలసీపైనే ఆధారపడటమూ సరికాదు. తప్పనిసరిగా కుటుంబం అంతటికీ వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్‌ ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోండి. కనీసం రూ.5లక్షల ఆరోగ్య బీమా ఉండటం ఈ రోజుల్లో తప్పనిసరి.
లక్ష్యాలను సమీక్షించుకోండి..
లాక్‌డౌన్‌ తర్వాత నగదు లభ్యతలో ఇబ్బంది ఏర్పడింది. ఉన్నంతలో సర్దుకోవడంలాంటివి అలవాటయ్యాయి. ఈ ప్రభావం పొదుపు, పెట్టుబడులపైనా పడింది. ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకొని, దానికోసం మదుపు చేస్తున్న వారు.. తాత్కాలికంగా నిలిపివేసిన సంఘటనలూ చూస్తున్నాం. ఈ ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక లక్ష్యాలను మరోసారి సమీక్షించుకోవాలి. సంవత్సర కాలంలో మీ దగ్గర తగ్గిన మొత్తం ఎంత.. లక్ష్యాల సాధనకు ఏదైనా అవాంతరాలు ఏర్పడ్డాయా పరిశీలించండి. అనుకున్న వాటిలో ముఖ్యమైన వాటిని గుర్తించండి. అంతగా అవసరం లేని లక్ష్యాలకు పెట్టుబడులు తగ్గించి, ప్రాధాన్యం ఉన్నవాటికి మళ్లించండి.
లాక్‌డౌన్‌ ముందు.. ఇప్పుడు మీ పెట్టుబడుల ప్రాధాన్యం ఒకే విధంగా ఉండకపోవచ్చు. నష్టాన్ని భరించే సామర్థ్యం తగ్గితే.. దానికి తగ్గట్టుగా పథకాల ఎంపిక ఉండాలి. కొత్త సాధారణ జీవితానికి అనుగుణంగా మదుపు కొనసాగించాలి. పెట్టుబడి పథకాల జాబితాను మరోసారి పరిశీలించండి. మీ ఆర్థిక పరిస్థితికి అనువుగా లేని వాటిని నిర్మొహమాటంగా వదిలించుకోవాలి.

మదుపు ఆపొద్దు..
ఈ ఏడాది కాలంలో.. పెట్టుబడి పథకాలు ఎన్నో హెచ్చుతగ్గులను చవిచూశాయి. మార్కెట్లు పతన స్థితి నుంచి జీవిత కాల గరిష్ఠానికి చేరడమూ చూశాం. మదుపు చేసి, హెచ్చుతగ్గులకు ఆందోళన చెందకుండా ఉన్న మదుపరులకు ఎప్పటికైనా మంచి ఫలితం వస్తుందని ఇది నిరూపించింది. కాబట్టి, ఎప్పుడూ పెట్టుబడులను ఆపొద్దు. కరోనా తర్వాత మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే.. స్వల్పకాలిక పెట్టుబడులకన్నా.. దీర్ఘకాలం కొనసాగినప్పుడే.. లాభం ఉంటుందని. మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో మన ఆర్థిక ప్రణాళికలో ప్రాధాన్యాలను గుర్తించాలి. ఎలాంటి చిక్కులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.
రుణాల విషయంలో..
ఏడాది కాలంగా రుణ వాయిదాల చెల్లింపులకు సంబంధించి ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆర్‌బీఐ రుణగ్రహీతల భారాన్ని తగ్గించేందుకు కొన్ని చర్యలూ తీసుకుంది. వాయిదాలను తాత్కాలికంగా వాయిదా వేసినా.. వాటిని ఎప్పటికైనా తిరిగి చెల్లించక తప్పదు. మన అవసరాల కోసం రుణం తీసుకోవడంతోపాటు, దాన్ని సమర్థంగా వినియోగించుకోవడం, సరైన సమయానికి వాయిదాలు చెల్లించడంలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండక తప్పని పరిస్థితి. అందుకే, రుణాలను తీసుకున్నప్పుడు వాటిని ఎలా చెల్లించాలి అనే విషయంలోనూ ప్రణాళిక వేసుకోవాలి. తాత్కాలికంగా ఆదాయం ఆగిపోయే పరిస్థితి వచ్చినా.. రుణ వాయిదాలకు ఇబ్బంది ఉండకుండా చూసుకోవాలి. దీనికోసం అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలి. అర్హత, అవసరానికి మించి అప్పులు తీసుకోవద్దు. అధిక వడ్డీలున్న రుణాలను వీలైనంత వెంటనే వదిలించుకోవాలి. క్రెడిట్‌ కార్డును జాగ్రత్తగా వాడకపోతే.. క్రెడిట్‌ స్కోరు తగ్గిపోతుంది. ఇప్పుడు కనీసం 800 స్కోరు లేకపోతే కొత్త అప్పులు, క్రెడిట్‌ కార్డులు రావడమూ కష్టంగా మారుతోంది. మీ గృహరుణంపై మారటోరియం వెసులుబాటును వాడుకొని ఉంటే.. వీలైనప్పుడల్లా కొంత మొత్తం అసలులో జమచేస్తూ వెళ్లండి. దీనివల్ల అదనపు వడ్డీ భారం తగ్గుతుంది. తొందరగా రుణ విముక్తులూ అవుతారు.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌.కామ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని