యూనికార్న్‌ క్లబ్‌లో డార్విన్‌బాక్స్‌

హైదరాబాద్‌కు చెందిన హెచ్‌ఆర్‌ (మానవ వనరుల) టెక్నాలజీ సేవల్లో నిమగ్నమైన అంకుర సంస్థ డార్విన్‌బాక్స్‌, ‘యూనికార్న్‌’ క్లబ్‌లో చేరింది. సంస్థాగత విలువ 100 కోట్ల డాలర్ల

Published : 26 Jan 2022 05:47 IST

హైదరాబాదీ అంకుర సంస్థ ఘనత

తాజాగా రూ.538 కోట్ల సమీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన హెచ్‌ఆర్‌ (మానవ వనరుల) టెక్నాలజీ సేవల్లో నిమగ్నమైన అంకుర సంస్థ డార్విన్‌బాక్స్‌, ‘యూనికార్న్‌’ క్లబ్‌లో చేరింది. సంస్థాగత విలువ 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7500 కోట్ల) కంటే అధికంగా ఉన్న అంకుర సంస్థలను యూనికార్న్‌లుగా పరిగణిస్తున్నారు. డార్విన్‌ బాక్స్‌ తాజాగా 72 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.538 కోట్లు) మూలధన నిధులు సమీకరించింది. బిలియన్‌ డాలర్ల సంస్థాగత విలువ ప్రకారం ఈ నిధులు లభించినట్లు డార్విన్‌బాక్స్‌ వెల్లడించింది. తద్వారా హైదరాబాద్‌ నుంచి తొలి ‘యూనికార్న్‌’గా ఈ సంస్థ నిలిచింది. హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించిన కొన్ని అంకుర సంస్థలకు ఇంతకు ముందు ఈ గుర్తింపు లభించింది. అయితే పూర్తిగా స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలైన చైతన్య పెద్ది, జయంత్‌ పాలేటి, రోహిత్‌ చెన్నమనేని కలిసి 2015లో హైదరాబాద్‌లో నెలకొల్పిన, పూర్తిగా ఇక్కడి నుంచే కార్యకలాపాలు విస్తరించిన ‘డార్విన్‌బాక్స్‌’, ‘యూనికార్న్‌’గా గుర్తింపు పొందడం ప్రత్యేకత. తాజాగా ఈ సంస్థకు టెక్నాలజీ క్రాస్‌ఓవర్‌ వెంచర్స్‌ (టీజీవీ), సేల్స్‌ఫోర్స్‌ వెంచర్స్‌, సిఖోయా, లైట్‌స్పీడ్‌, ఎండియా పార్టనర్స్‌, 3వన్‌4కేపిటల్‌ నిధులు సమకూర్చాయి. ఈ సంస్థ ఇప్పటి వరకు 110 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.825 కోట్ల) మేరకు మూలధన నిధులు సమీకరించింది. తాజాగాలభించిన మూలధనంతో తన వ్యాపార కార్యకలాపాలను బహుముఖంగా విస్తరిస్తామని, నూతన టెక్నాలజీ సేవలు ఆవిష్కరించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు డార్విన్‌బాక్స్‌ వెల్లడించింది.

650 సంస్థలకు సేవలు

డార్విన్‌బాక్స్‌  ప్రస్తుతం వివిధ దేశాలకు చెందిన 650 సంస్థలకు సేవలు అందిస్తోంది. జేఎస్‌డబ్ల్యూ, అదానీ, మహీంద్రా, వేదాంతా, ఎస్‌బీఐ, జనరల్‌ ఇన్సూరెన్స్‌, కోటక్‌, టీవీఎస్‌, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా, రాంకీ, అరబిందో ఫార్మా, బిగ్‌బాస్కెట్‌, స్విగ్గీ, మేక్‌మైట్రిప్‌.. తదతర సంస్థలు ఇందులో ఉన్నాయి. నూతన తరం సంస్థల్లోని భవిష్యతరం ఉద్యోగులకు అనువుగా ఉత్తమ, అత్యాధునిక టెక్నాలజీని ఆవిష్కరించాలనే లక్ష్యంతో తాము ఈ సంస్థను నెలకొల్పామని, ఈ విభాగంలో ప్రపంచస్థాయిలో అగ్రస్థానానికి చేరాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు జయంత్‌ పాలేటి వివరించారు. ఈ సంస్థ కార్యకలాపాలు ప్రధానంగా హైదరాబాద్‌ నుంచి కొనసాగుతుండగా, అదనంగా వివిధ దేశాల్లో 12 కార్యాలయాలను నిర్వహిస్తోంది. మొత్తం 700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది లోగా ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేస్తామని, ఇందులో ఎక్కువ మందిని హైదరాబాద్‌లోనే నియమిస్తామని కంపెనీ వెల్లడించింది.

తెలంగాణా నుంచి సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌) విభాగ అంకుర సంస్థ, ‘యూనికార్న్‌’ కావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని తెలంగాణ ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ పేర్కొన్నారు. అంకుర సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో మద్దతు ఇస్తోందని వివరించారు. అన్ని రకాల సదుపాయాలు ఉండటం, నైపుణ్యం కల మానవ వనరుల లభ్యత ఇక్కడ అనుకూలించే అంశాలని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఉన్నందున సంబంధిత పరిశ్రమల నైపుణ్యం, విజ్ఞానం సైతం అంకుర సంస్థల విస్తరణకు దోహదపడుతోందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని