బాండ్లలో లావాదేవీలు నిర్వహిస్తాం

ప్రధానంగా ఈక్విటీ మార్కెట్‌కు సేవలు అందిస్తూ వచ్చిన ఎన్‌ఎస్‌డీఎల్‌ (నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌) కొత్త ఉత్పత్తులు, సేవలపై దృష్టి సారించింది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా బాండ్లు, ‘ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌’(ఈజీఆర్‌) వంటి కొత్త ఉత్పత్తులకు తన సేవలను విస్తరించనుంది

Updated : 25 Sep 2022 09:09 IST

 ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌లోనూ..
అందుకు తగిన సన్నాహాలు చేస్తున్నాం
దేశంలో ఈక్విటీ పెట్టుబడుల సంస్కృతి పెరుగుతోంది
స్టాక్‌ మార్కెట్లో నమోదుపై అంకుర సంస్థల్లో ఆసక్తి
ఈనాడు ఇంటర్వ్యూ
ఎన్‌ఎస్‌డీఎల్‌ ఎండీ, సీఈఓ పద్మజ చుండూరు
ఈనాడు - హైదరాబాద్‌

ప్రధానంగా ఈక్విటీ మార్కెట్‌కు సేవలు అందిస్తూ వచ్చిన ఎన్‌ఎస్‌డీఎల్‌ (నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌) కొత్త ఉత్పత్తులు, సేవలపై దృష్టి సారించింది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా బాండ్లు, ‘ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌’(ఈజీఆర్‌) వంటి కొత్త ఉత్పత్తులకు తన సేవలను విస్తరించనుంది. దీనికి తగిన సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్‌ఎస్‌డీఎల్‌ ఎండీ, సీఈఓ పద్మజ చుండూరు ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంటర్వ్యూ విశేషాలు

మీరు సుదీర్ఘకాలం పాటు బ్యాంకర్‌గా ఉన్నత స్థానాల్లో కొనసాగారు. ఇప్పుడు స్టాక్‌మార్కెట్లో కార్యకలాపాల్లో కీలకంగా ఉన్న ఎన్‌ఎస్‌డీఎల్‌లో ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ మార్పు మీకెలా అనిపిస్తోంది.
ఎన్‌ఎస్‌డీఎల్‌లో గొప్ప మానవ వనరులు ఉన్నాయి. వారితో కలిసి పనిచేయటం వల్ల నాకు ఈ పని కొత్తదనే భావన రాలేదు. మన దేశంలో బ్యాంకింగ్‌ రంగంలో కొన్నేళ్ల క్రితం ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయో, అటువంటి వినూత్నమైన మార్పులు ఇప్పుడు స్టాక్‌మార్కెట్లలో కనిపిస్తున్నాయి. జామ్‌ (జనధన్‌, ఆధార్‌, మొబైల్‌)తో ఈ మార్పులు వస్తున్నాయని చెప్పాలి. దీనివల్ల బ్యాంకింగ్‌లో లావాదేవీలు, చెల్లింపులు అనూహ్యంగా పెరిగినట్లు, స్టాక్‌మార్కెట్లోనూ మదుపరుల సంఖ్య, లావాదేవీల పరిమాణం వేగంగా పెరుగుతోంది. ఎన్నో ఏళ్ల పాటు బ్యాంకింగ్‌ రంగంలో అన్ని రకాలైన మార్పులను చూసిన నాకు, ఎన్‌ఎస్‌డీఎల్‌లో సెక్యూరిటీల కార్యకలాపాలు పర్యవేక్షించడం ఆసక్తికరంగా ఉంది.

మీరు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్‌ఎస్‌డీఎల్‌లో ఎటువంటి మార్పులు తీసుకువచ్చారు.
మనదేశంలో మొట్టమొదటి డిపాజిటరీ సేవల సంస్థ ఎన్‌ఎస్‌డీఎల్‌. డీమ్యాట్‌ అనే పదాన్ని సృష్టించిందే ఈ సంస్థ. గత పాతికేళ్లుగా కేపిటల్‌ మార్కెట్ల విస్తరణలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తోంది. ఇటీవల కాలంలో స్టాక్‌ మార్కెట్లోకి వచ్చే మదుపరుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తమ కష్టార్జితాన్ని తీసుకువచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. దీనికి తగినట్లుగా ఎన్‌ఎస్‌డీఎల్‌ స్పందిస్తోంది. ‘మార్కెట్‌ కా ఏకలవ్య’ అనే పేరుతో హిందీ, కొన్ని ప్రాంతీయ భాషల్లో మదుపరుల్లో అవగాహన పెంపొందిస్తున్నాం. మదుపరులకు ‘ద ఫైనాన్షియల్‌ కెలడోస్కోప్‌’ అనే పేరుతో నెలకోసారి న్యూస్‌ లెటర్‌ పంపిస్తున్నాం. ఇదే కాకుండా ఎన్‌ఎస్‌డీఎల్‌ సమర్థతను ఎన్నో రెట్లు పెంపొందించటం, తద్వారా మదుపరులకు మెరుగైన సేవలు అందించటం లక్ష్యంగా ‘ప్రోగ్రామ్‌- ఏపీటీ’ అనే మరొక కార్యక్రమాన్ని తీసుకున్నాం.

కొత్త సేవలు, ఉత్పత్తులు ఆవిష్కరించే ఆలోచన చేస్తున్నారా.
ఎన్‌ఎస్‌డీఎల్‌ ఇంత వరకూ ఈక్విటీకే పరిమితం కాగా, మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా బాండ్లు, ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌రిసీట్స్‌(ఈజీఆర్‌) వంటి నూతన ఉత్పత్తులను అందించటానికి సిద్ధపడుతున్నాం. కొలేటరల్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (సీఎంఎస్‌), డీఎల్‌టీ(బ్లాక్‌చైన్‌) ప్లాట్‌ఫామ్‌పై డిబెంచర్‌ సెక్యూరిటీ అండ్‌ కొవనాంట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను ఆవిష్కరించబోతున్నాం.

ఎన్‌ఎస్‌డీఎల్‌ పబ్లిక్‌ ఇష్యూకు రాబోతోందా.
ఆలోచన ఉంది. దీనిపై పని ప్రారంభించాం. సరైన సమయంలో పబ్లిక్‌ ఇష్యూకు వస్తాం.

మన దేశంలో ఈక్విటీ పెట్టుబడుల అలవాటు తక్కువ. ముఖ్యంగా రిటైల్‌ మదుపరుల్లో ఇటువంటి ఆలోచన లేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మార్పు వస్తోందా.
తాజాగా డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 10 కోట్లకు చేరుకుంది. గత రెండేళ్ల వ్యవధిలో కొత్తగా 4 కోట్ల డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభమ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో మా వద్ద డీమ్యాట్‌ ఖాతాలు 127 శాతం పెరిగాయి. ‘ఈక్విటీ’ సంస్కృతి విస్తరిస్తోందనడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి. ముఖ్యంగా యువత ఈక్విటీ పెట్టుబడులపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మన ఆర్థిక వ్యవస్థ అకర్షణీయమైన వృద్ధి నమోదు చేస్తున్నందున పెట్టుబడి అవకాశాలు మున్ముందు ఎంతగానో పెరుగుతాయి. దీనికి అనుగుణంగా ఈక్విటీ పెట్టుబడులు ఇంకా పెరుగుతాయి.

అంకుర సంస్థలు స్టాక్‌మార్కెట్లో నమోదు కావటం, తద్వారా వృద్ధి అవకాశాల్లో మదుపరులకు భాగస్వామ్యం కల్పించడంపై మీ ఆలోచనలు ఏమిటి.
మనదేశంలో 78,000కు పైగా అంకుర సంస్థలు ఉన్నాయి. ‘యూనికార్న్‌’ల సంఖ్య 100కు మించిపోయింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇస్తున్న మద్దతు కారణంగా అంకుర సంస్థలు పెద్ద సంఖ్యలో మొదలై, విజయాలు సాధిస్తున్నాయి. ఎన్‌ఎస్‌డీఎల్‌లో ప్రస్తుతం కొన్ని ‘ప్రాసెస్‌’లను బలోపేతం చేయడంపై దృష్టి సారించాం. ఈ ప్రక్రియ పూర్తయితే, అంకుర సంస్థలకు అవసరమైన మద్దతును పూర్తిస్థాయిలో అందించగలుగుతాం.

కొన్ని దశాబ్దాలుగా అటు వ్యక్తిగత జీవితాన్ని, ఇటు వృత్తి పరమైన బాధ్యతలను సమర్థంగా ఎలా నిర్వహిస్తున్నారు.
నేను పని విభజన, టీమ్‌ వర్క్‌ను విశ్వసిస్తాను. సానుకూల దృక్ఫథంతో వ్యవహరిస్తాను. నా విజయాల్లో నా కుటుంబం, నేను పని చేసిన సంస్థల్లోని సహచరుల పాత్ర ఎంతగానో ఉంది.

మీరు ఇండియన్‌ బ్యాంకు ఎండీ, సీఈఓగా ఉన్న సమయంలో అలహాబాద్‌ బ్యాంకు విలీన ప్రక్రియను చేపట్టి సమర్థంగా పూర్తిచేశారు. ఈ క్రమంలో ఎటువంటి సవాళ్లు ఎదుర్కొన్నారు.
ఇండియన్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంకుల మధ్య ఎన్నో వైరుధ్యాలు ఉన్నాయి. విలీన ప్రక్రియ మొదలు కాగానే ‘కొవిడ్‌’ ముప్పు ముంచుకు వచ్చింది. దీంతో డిజిటల్‌ పద్దతిలో విలీన ప్రక్రియను కొనసాగించాల్సి వచ్చింది. దీన్ని సజావుగా పూర్తి చేయడంలో ఇండియన్‌ బ్యాంకు బృందం ఎంతో సమర్థంగా వ్యవహరించింది. తక్కువ సమయంలో వినియోగదార్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విలీన ప్రక్రియను ముగించింది. ఈ ప్రక్రియ ‘హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌’ అధ్యయనాంశం(కేస్‌ స్టడీ)గా ఎంపిక అయిందంటే, ఎంత సమర్థంగా ఈ వ్యవహారాన్ని పూర్తి చేసిందీ అర్థం చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని