
తాజా వార్తలు
సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
సిడ్నీ: సిడ్నీ వేదికగా జరిగిన భారత్×ఆస్ట్రేలియా మూడో టెస్టులో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్కు ఆకతాయిల నుంచి జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురైన సంగతి తెలిసిందే. అయితే అదే టెస్టులో ఆఖరి రోజు కృష్ణకుమార్ అనే భారత అభిమాని కూడా జాతివివక్షకు గురయ్యాడనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైదాన సిబ్బందే సదరు ప్రేక్షకుడిపై వర్ణవివక్ష వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే తనకి ఎదురైన ఈ అవాంఛనీయ సంఘటనపై కుమార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై న్యూసౌత్వేల్స్ అధికార యంత్రాంగం విచారణ చేస్తోంది.
సిరాజ్కు ఎదురైన అవాంఛనీయ సంఘటన నేపథ్యంలో.. ‘పోటీ మంచిది..జాత్యహంకారం కాదు, వివక్ష వద్దు, అలాంటి సంఘటనలు జరగకుండా క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకోవాలి’ అని కొన్ని బ్యానర్లతో కుమార్ అయిదో రోజు ఆటను వీక్షించడానికి స్టేడియానికి వెళ్లారు. అయితే పరిమిత నిబంధనల ప్రకారం బ్యానర్లు ఉన్నప్పటికీ వాటిని అనుమతించలేదని ఆయన తెలిపారు. దీనిపై భద్రతా సిబ్బందిని కుమార్ అడగ్గా.. ‘సమాధానం కావాలంటే ఎక్కడ నుంచి వచ్చావో అక్కడికే వెళ్లాల్సి వస్తుంద’ని దురహంకారాన్ని ప్రదర్శిస్తూ సిబ్బంది వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.
ఫిర్యాదుపై సంబంధిత అధికారులు స్పందిస్తూ విచారణ కొనసాగుతుందని తెలిపారు. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులోనూ సిరాజ్ మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలకు గురైన సంగతి తెలిసిందే. అయితే దీనిపై టీమిండియా యాజమాన్యం ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.
ఇదీ చదవండి
పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్
యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్