
తాజా వార్తలు
మేం గెలవడానికి కారణం టిమ్పైనే..
ఆసీస్ కెప్టెన్పై మరోసారి అశ్విన్ సెటైర్లు
ఇంటర్నెట్డెస్క్: ఇటీవల టెస్టు సిరీస్లో టీమ్ఇండియా ఘన విజయానికి ఆసీస్ కెప్టెన్ టిమ్పైన్ కూడా ఓ కారణమని రవిచంద్రన్ అశ్విన్ మరోసారి సెటైర్లు వేశాడు. సిడ్నీ టెస్టులో వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలిన సంగతి తెలిసిందే. ‘గబ్బాకు రా చూసుకుందాం’ అని పైన్ అంటే.. ‘నువ్వు ఇండియాకు వస్తే అదే నీ ఆఖరి సిరీస్’ అంటూ అశ్విన్ సైతం సవాల్ చేశాడు. ఈ వీడియో వైరల్గా మారింది. ఈ విషయంపై ఆస్ట్రేలియా కెప్టెన్ తర్వాత బహిరంగ క్షమాపణలు చెప్పాడు. తాను అలా చేయాల్సింది కాదన్నాడు.
అశ్విన్ తాజాగా టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్తో ముచ్చటించాడు. తన యూట్యూబ్ ఛానెల్లో ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంగా మరోసారి టిమ్పైన్పై అశ్విన్ ఛలోక్తులు విసిరాడు. గబ్బా టెస్టులో అతడు చేసిన తప్పిదాలతో భారత్ గెలిచిందని వ్యంగ్యస్త్రాలు సంధించాడు. ‘రెండో ఇన్నింగ్స్లో పంత్(89*)ను స్టంపింగ్ చేసే అవకాశాన్ని పైన్ వదిలేశాడు. దాంతో నేనతడిని ఇష్టపడటం మొదలెట్టాను. మమ్మల్ని గబ్బాకు రమ్మని పిలిచాడు.. తీరా వెళితే అక్కడ స్టంపింగ్ చేసే అవకాశాన్ని వదిలేశాడు. అలా అతడే మాకు సిరీస్ను కట్టబెట్టాడు. 2-1 తేడాతో మేం గెలుపొందడానికి కృషి చేశాడని చెప్పను కానీ, మరోలా చెప్పాలంటే అదే చేశాడు’ అని అశ్విన్ సరదాగా వివరించాడు.
కాగా, మూడో టెస్టులో అశ్విన్(39*), హనుమ విహారి(23*)తో కలిసి ఓటమి వైపు వెళ్తున్న మ్యాచ్ను డ్రాగా ముగించాడు. ఒకవైపు విపరీతమైన వెన్నునొప్పి బాధిస్తున్నా అశ్విన్ ఎంతో నిబద్ధతతో ఆడాడు. వీరిద్దరూ 259 బంతులు ఎదుర్కొని చివరి వరకూ క్రీజులో పాతుకుపోయారు. తాము ఔటైతే టెయిలెండర్ల వికెట్లు పడతాయనే ఉద్దేశంతో మ్యాచ్ను డ్రా దిశగా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే సిడ్నీ టెస్టును డ్రా చేయడంతో అశ్విన్పై ప్రశంసల జల్లు కురిశాయి. ఆరోజే పైన్ స్లెడ్జింగ్ చేయడంతో దీటుగా బదులిచ్చాడు.
ఇవీ చదవండి..
ద్రవిడ్ సలహాలు పాటిస్తే మేలు : పీటర్సన్
‘301’ క్యాప్.. వెలకట్టలేని సంపద