
తాజా వార్తలు
15,948 రికవరీలు.. 14,849 కేసులు
దిల్లీ: భారత్లో గత 24 గంటల్లో 7,81,752 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,849 కేసులు పాజిటివ్గా తేలినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం వెల్లడించిన వివరాలతో పోలిస్తే.. నేడు రోజువారీ కేసుల సంఖ్య నాలుగు శాతం పెరగడం గమనార్హం. ఇక మొత్తం కేసుల సంఖ్య 1,06,54,533కి చేరింది. కొత్తగా 15,948 మంది వైరస్ బారి నుంచి కోలుకొన్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,03,16,786కు చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 96.83 శాతానికి పెరిగింది.
ఇక మరణాల విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 155 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,53,339కి చేరింది. ప్రస్తుతం మరణాల రేటు 1.44 శాతంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1,84,408కు తగ్గింది.
మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం జనవరి 16న ప్రారంభమైన విషయం తెలిసిందే. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,91,609 మందికి టీకా ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు టీకా తొలి డోసు అందిన వారి సంఖ్య 15,82,201కు చేరింది. తొలి విడతలో పారిశుద్ధ్య కార్మికులు, కిందిస్థాయి ఆరోగ్య సిబ్బంది టీకాలు పొందుతున్న విషయం తెలిసిందే. సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగం కింద ప్రజలకు అందిస్తున్నారు.
ఇవీ చదవండి..
ఆదుకుంటున్న మునుపటి కరోనా ఇన్ఫెక్షన్లు