
తాజా వార్తలు
చైనా, ఇటలీని దాటేసిన అమెరికా..!
వాషింగ్టన్: కరోనా వైరస్ ఇప్పుడు అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోది. చైనా, ఇటలీ, స్పెయిన్లో సృష్టించిన ఉత్పాతాన్ని ఇప్పుడు అగ్రరాజ్యంలోనూ మొదలుపెట్టింది. యూఎస్లో కరోనా విలయతాండవం చేయబోతోందన్న పరిశోధకుల హెచ్చరికలు వాస్తవరూపం దాలుస్తున్నాయి. తాజాగా చైనా, ఇటలీని దాటుకొని ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో అమెరికా తొలిస్థానంలో నిలిచింది. గురువారం నాటికి ఆ దేశంలో 83,545 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇది 14.9శాతం. వీరిలో 1,201 మందికి పైగా మృత్యువాతపడ్డారు. చైనాలో ఇప్పటి వరకు 81,285 మంది, ఇటలీలో 80,589 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు.
అయితే, మిగతా దేశాలతో పోలిస్తే కరోనా నిర్ధారణ పరీక్షల్ని అమెరికా భారీ స్థాయిలో పెంచింది. అందువల్లే ప్రతిరోజు పెద్ద ఎత్తున కొవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. కేవలం ఎనిమిది రోజుల్లో 2,20,000 వేల మందికి పరీక్షలు నిర్వహించినట్లు దేశంలో పరిస్థితుల్ని సమీక్షిస్తున్న శ్వేతసౌధంలో సీనియర్ వైద్యుడు దెబోరా తెలిపారు. అయితే చైనా, ఇటలీతో పోలిస్తే మరణాల సంఖ్య అమెరికాలో తక్కువగా ఉండడం ఊరట కలిగించే అంశం. ఒక్క న్యూయార్క్లోనే 38వేల మంది వైరస్ బారిన పడగా.. 281 మంది మరణించారు.
జిన్పింగ్తో మాట్లాడతా..: ట్రంప్
కరోనా వైరస్ వ్యాప్తిపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో చర్చిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం తెలిపారు. కొన్ని రోజుల క్రితం చైనాపై ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ను ‘చైనీస్ వైరస్’గా అభివర్ణించడంతో పాటు.. కొవిడ్-19 తీవ్రతను ప్రపంచానికి తెలియజేయడంలో చైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. తాజాగా చైనాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎంతో ఎవరికీ తెలియదంటూ మరోసారి ఆ దేశంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో వీరివురి చర్చలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి..