
తాజా వార్తలు
దిల్లీలో దుకాణాలు @ 24 గంటలు
దిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు నిత్యావసరాల కొనుగోలు విషయంలో తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఈ మేరకు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంయుక్తంగా నిర్వహించిన డిజిటల్ ప్రెస్కాన్ఫరెన్స్లో మాట్లాడారు. దిల్లీలో గడిచిన 24 గంటల్లో ఒక్క పాజిటివ్ కేసు నమోదైందని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 36కు చేరిందని వివరించారు.
వంట సామగ్రి, కూరగాయలు, పాలు వంటి నిత్యావసర సరకులు విక్రయించే దుకాణాలు ఇకపై నిత్యం అందుబాటులో ఉంటాయని, సరిపడా నిల్వలు ఉండేలా స్థానిక అధికారులను ఆదేశించినట్లు బైజాల్ తెలిపారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారని, కానీ మరిన్ని చర్యలు అవసరమని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దిల్లీలో నమోదైన 36 కేసుల్లో 26 కేసులు ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారేనని తెలిపారు. మొహల్లా క్లినిక్లో వైద్యుడికి, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు తేలిందని, అయితే, మొహల్లా కేంద్రాలు యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించారు. కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తామని కేజ్రీవాల్ తెలిపారు.