
తాజా వార్తలు
పోలీసుల అదుపులో దిల్లీ కాల్పుల నిందితుడు
దిల్లీ: ఈశాన్య దిల్లీలో సీఏఏ వ్యతిరేక, మద్దతుదారుల ఆందోళనలలో కాల్పులు జరిపిన వ్యక్తిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నిందితుడిని షాదార ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల షారుఖ్గా గుర్తించారు. ‘‘జఫ్రాబాద్ ప్రాంతంలో ఎరుపు రంగు టీషర్ట్ ధరించిన ఓ వ్యక్తి ఆందోళకారుల మధ్య నుంచి వచ్చి మరో వైపున ఆందోళ చేస్తున్న వారిపై కాల్పులు జరిపి తిరిగి గుంపులో కలిసిపోయాడు. అంతేకాకుండా అతడిని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసుపై తుపాకీ గురిపెట్టి నెట్టివేశాడు’’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి షారుఖ్ను అదుపులోకి తీసుకొన్నారు. అతడి మీద ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ , మరికొంత మంది రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.