
తాజా వార్తలు
భారత్లో రష్యా టీకా ప్రయోగాలు ప్రారంభం!
డాక్టర్ రెడ్డీస్, ఆర్డీఐఎఫ్ వెల్లడి
హైదరాబాద్: భారత్లో రష్యా టీకా ప్రయోగాలు ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) సంయుక్తంగా ప్రకటించాయి. స్పుత్నిక్-వి టీకా రెండు, మూడో దశ పయోగాల కోసం కావాల్సిన అనుమతులను సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీ నుంచి పొందినట్లు వెల్లడించాయి. జేఎస్ఎస్ మెడికల్ రీసెర్చ్ భాగస్వామ్యంతో ఈ ప్రయోగాలను నిర్వహిస్తున్నామని తెలిపాయి. అయితే, ప్రయోగాల సలహా కోసం భారత బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టాన్స్ కౌన్సిల్(BIRAC)తో కలిసి పనిచేస్తున్నామని డాక్టర్ రెడ్డీస్ పేర్కొంది. అంతేకాకుండా BIRACకి చెందిన ప్రయోగ కేంద్రాలను కూడా ఈ క్లినికల్ ట్రయల్స్ కోసం వినియోగించుకోనున్నట్లు వెల్లడించింది. అయితే, వ్యాక్సిన్ ప్రయోగాలను చేపట్టడంలో ఇదొక కీలక మైలురాయి అని డాక్టర్ రెడ్డీస్ సంస్థ కో-ఛైర్మన్, ఎండీ జీవీ రమణ తెలిపారు. ఇక భారత్లో స్పుత్నిక్ వ్యాక్సిన్ ప్రయోగాలను చేపట్టడంతో పాటు 10కోట్ల డోసులను సరఫరా చేసేందుకు ఆర్డీఐఎఫ్తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. క్లినికల్ ట్రయల్స్లో భాగంగా రెండో దశలో 100మంది, మరో 1400 మంది వాలంటీర్లను మూడో దశ కోసం నియమించుకుంటున్నట్లు సమాచారం.
ఇక, రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ప్రయోగాలను 40వేల మందిపై జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రష్యాలో ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో వ్యాక్సిన్ 91.4శాతం సమర్థతతో పనిచేస్తున్నట్లు రెండో మధ్యంతర నివేదికను ఆర్డీఐఎఫ్ వెల్లడించింది. టీకా తీసుకున్న వారిలో ఎలాంటి దుష్ర్పభావాలు లేవని స్పష్టంచేసింది. కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా, ఎక్కువ కాలం రోగనిరోధక శక్తిని కలిగి ఉండనుందని స్పుత్నిక్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక వీటిని సాధారణ రిఫ్రిజిరేటర్ల ఉష్ణోగ్రత మధ్యే (2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్) నిల్వ చేసుకోవచ్చని పేర్కొంది. వ్యాక్సిన్ను రష్యాలో ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించిన స్పుత్నిక్-వి పరిశోధకులు, అంతర్జాతీయ మార్కెట్లో ఒక డోసు ధర 10డాలర్ల కంటే తక్కువే ఉండనుందని వెల్లడించారు. అయితే ఈ వ్యాక్సిన్ను రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో దాదాపు 20డాలర్లు అయ్యే అవకాశం ఉంది. అయితే, మిగతా కరోనా వ్యాక్సిన్లతో పోలిస్తే దీని ధర తక్కువగానే ఉందని స్పుత్నిక్-వి రూపకర్తలు అభిప్రాయపడ్డారు.