
తాజా వార్తలు
‘సీఎం పదవా? నాకంత తొందరేం లేదు’
నాందేడ్: ముఖ్యమంత్రి కావడంపై తనకంత తొందరేమీ లేదని కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మంత్రి అశోక్ చవాన్ అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రస్తుతం పూర్తి మద్దతుతో పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో ఎక్కువకాలం ఉన్నవారెవరైనా సీఎం కావాలని కోరుకుంటారంటూ ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. బోకోర్ పట్టణంలో ఓ ర్యాలీలో మాట్లాడిన ఆయన.. ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా.. తామంతా మనస్ఫూర్తిగా ఆయనతోనే ఉన్నామన్నారు. సీఎం కావడంపై తనకేమీ తొందరలేదంటూ వ్యాఖ్యానించారు.
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు ఒక వేదికపైకి వచ్చి మహా వికాస్ అఘాడిగా ఏర్పడటం ద్వారా రాష్ట్రంలో భాజపాను బహిష్కరించడంలో విజయవంతమైనట్టు చెప్పారు. కొంతమంది సమస్యలు సృష్టించాలని ప్రయత్నించినా అవి విజయవంతం కావన్నారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పూర్తికాలం పాటు కొనసాగుతుందని అశోక్ చవాన్ స్పష్టంచేశారు. గతంలో 2008-10 మధ్య కాలంలో మహారాష్ట్ర సీఎంగా అశోక్చవాన్ పనిచేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి..
దేశానికి నాలుగు రాజధానులు ఉండాలి