
తాజా వార్తలు
న్యాయవాదుల హత్యపై హైకోర్టు ప్రశ్నలు
హైదరాబాద్: హైకోర్టు న్యాయవాదులు వామన్రావు దంపతుల హత్యలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం పోలీసులను పలు ప్రశ్నలు వేసింది. ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ, వీడియో రికార్డింగ్లు స్వాధీనం చేసుకున్నారా? అని ప్రశ్నించింది. ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న బస్సులోని ప్రయాణికులందరినీ గుర్తించారా? అని అడిగింది. వీటికి సమాధానమిచ్చిన అడ్వొకేట్ జనరల్ ప్రయాణికులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ఎదుట ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. ఇద్దరి వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ నెల 4న వామన్రావు తండ్రి వాంగ్మూలం నమోదు చేస్తామని వివరించారు. మిగతా సాక్షుల వాంగ్మూలాలు ఎందుకు నమోదు చేయలేదని కోర్టు ప్రశ్నించగా.. ఇందుకు సంబంధించిన అనుమతిని ఇవాళే మేజిస్ట్రేట్ను కోరతామన్నారు.
తదుపరి విచారణలో వివరాలు సమర్పిస్తాని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు గల నెల 24 వరకు జరిగిన దర్యాప్తు వివరాలను కోర్టుకు సమర్పించారు. దర్యాప్తుస్థాయి నివేదికను పోలీసులు సీల్డ్ కవర్లో అందజేశారు. నలుగురు నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది.