
తాజా వార్తలు
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు
హైదరాబాద్: ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టేను డిసెంబర్ 3వ తేదీ వరకు హైకోర్టు పొడిగించింది. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేసన్లు, మ్యుటేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్లపై గత కొంత కాలంగా విచారణ కొనసాగుతోంది. గతంలో విచారించిన హైకోర్టు ధరణి ద్వారా వ్యవసాయేతర ఆస్తుల నమోదు చేపట్టవద్దని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు వీలుగా స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కోర్టును కోరారు. ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం స్టే ఎత్తివేసేందుకు నిరాకరించింది. రేపు ఇదే విషయంపై వాదనలు కొనసాగించాలని కోరగా.. ఏజీ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ధరణికి సంబంధించిన కేసుల విచారణను డిసెంబర్ 3కి వాయిదా వేసింది.