
తాజా వార్తలు
హైదరాబాద్లో వారికేం పని: తలసాని
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు అవాస్తవాలను ప్రచారం చేస్తూ హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అరోపించారు. తెలంగాణ భవన్లో తలసాని మీడియాతో మాట్లాడారు. పాతబస్తీలో 40 వేల మంది రోహింగ్యాలు ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇదే నిజమైతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు తమ వెంట వస్తే హైదరాబాద్ నగరంలో తాము చేసిన అభివృద్ధిని చూపిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటివరకు హైదరాబాద్కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని మండిపడ్డారు. హైదరాబాద్లో ఇటీవల వచ్చిన వరదలకు సంబంధించి కేంద్రానికి నివేదిక ఇచ్చి నెలలు గడుస్తున్నా స్పందన లేదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో అసాధ్యమైన హామీలు ఇచ్చారని.. ఆ పార్టీని చూస్తే జాలి వేస్తోందన్నారు. ఎంఐఎం నేతలు దేశమంతా తిరుగుతూ పోటీ చేస్తూ ఎవరికి లాభం చేస్తున్నారో భాజపా నేతలు తెలుసుకోవాలన్నారు. కేంద్ర మంత్రులు ప్రకాష్ జావదేకర్, స్మృతీ ఇరానీ వాళ్ల వాళ్ల నగరాల్లో ఏమైనా మాట్లాడుకోవచ్చని.. హైదరాబాద్లో వారికేంపనని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ను చెడగొట్టవద్దని తలసాని హితవు పలికారు.