
తాజా వార్తలు
వరద పోయింది.. బురదే మిగిలింది!
కడప జిల్లాను మంచెత్తిన బుగ్గవంక ప్రాజెక్టు నీరు
ఇంటర్నెట్ డెస్క్: 2 కిలోమీటర్ల రక్షణ గోడ నిర్మాణంలో 2 దశాబ్దాలుగా జాప్యం జరుగుతుండటంతో కడపలో 10 కాలనీలు బుగ్గవంక వాగు ముంపు బారిన పడ్డాయి. వరద ప్రవాహంతో కాలనీ వీధులన్నీ బురదమయమయ్యాయి. నగరంలోని వందల కుటుంబాలపై తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. ముంపు ప్రభావంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తిరిగొచ్చిన స్థానికులకు ఇళ్ల చుట్టూ పేరుకుపోయిన బురద మేటలే కనిపిస్తున్నాయి. అనేకమందికి కట్టుబట్టలే మిగిలాయి. వ్యాపారుల ఆశలు జల సమాధి అయ్యాయి.
కడప జిల్లా సీకే దిన్నె మండలంలోని బుగ్గవంక ప్రాజెక్టుకు ఎప్పుడు వరదొచ్చినా నగర వాసులకు కంటిమీద కునుకుండదు. 2001లో బుగ్గవంక ఉద్ధృతికి ఆస్తినష్టంతోపాటు పదుల సంఖ్యలో ప్రాణాలు జల సమాధి అయ్యాయి. మళ్లీ 2020లో అదే వరద కడప నగరాన్ని చుట్టేసింది. ఈనెల 26న బుగ్గవంక నుంచి ఒకేసారి 19 వేల క్యూసెక్కుల నీరు వదలడంతో రవీంద్రనగర్, నాగరాజుపేట, బాలాజీనగర్, నబీకోట, గుర్రాలగడ్డ, వైవీ స్ట్రీట్, ఏడు రోడ్ల కూడలి సహా పది కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. చాలా మంది బంధువులకు వెళ్లగా, మరికొందరు ఆ ముంపులోనే జల జీవనం చేశారు. దాదాపు 500 ఇళ్లలోని సామాన్లు కొట్టుకుపోగా, ఉన్నవి కూడా పనికిరాకుండా పోయాయి. చెప్పులు, సెల్ఫోన్లు, కిరాణా దుకాణాల్లోకి నీరు చేరి వ్యాపారులు తీవ్ర నష్టాలపాలయ్యారు. నీళ్లు వదిలే కొన్ని గంటల ముందు అధికారులు హెచ్చరించి ఉంటే జాగ్రత్తపడేవారమని స్థానికులు వాపోతున్నారు.