
తాజా వార్తలు
రహదారుల కోసం చెట్లను నరకడమా?: సుప్రీంకోర్టు
(ప్రతీకాత్మక చిత్రం)
దిల్లీ: రహదారుల విస్తీర్ణం పెంచేందుకు వేల సంఖ్యలో చెట్లు నేలకూలేందుకు తాము అనుమతించమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలోని ఆలయానికి వెళ్లే 25 కిలోమీటర్ల రహదారిని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2,940 చెట్లను తొలగించేందుకు అనుమతి కోరుతూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానికి పరిహారంగా 138.41 కోట్లను ఇస్తామని వారు కోర్టుకు తెలిపారు. తొలగించిన చెట్ల కన్నా ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటుతామని వారు చెప్పగా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వందల ఏళ్లనాటి వృక్షాలను తొలగించి కొత్త మొక్కలను నాటడం ఏ మాత్రం సముచితం అని ఉన్నత న్యాయస్థానం యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘మానవులకు ఆక్సిజన్ను అందించే చెట్ల విలువను మనం నిర్ణయించలేం. చెట్టు వయసు పెరిగే కొద్దీ అది ఆక్సిజన్ అందించే క్రమంలో కూడా మార్పులొస్తాయి. ’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, వి రామసుబ్రమణియన్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. చెట్లను తొలగించడం ద్వారా రహదారులను విస్తరించి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించొచ్చు అన్న యూపీ ప్రభుత్వ సూచనను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. చెట్లను నరికేందుకు ప్రభుత్వం చెప్పిన కారణాలు సముచితంగా లేవన్న ఉన్నత న్యాయస్థానం వారికి మరో నాలుగు వారాలు గడువు ఇచ్చింది. ఆలోగా ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన నివేదిక కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.