
తాజా వార్తలు
సంజయ్ను అడ్డుకునేందుకు తెరాస శ్రేణుల యత్నం
ఖైరతాబాద్: నగరంలోని నెక్లెస్రోడ్డులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను తెరాస కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సాయంత్రం సరదాగా గడిపేందుకు బండి సంజయ్ పీపుల్స్ప్లాజాకు వచ్చారు. అక్కడి నుంచి లేక్వ్యూ పోలీస్ అవుట్పోస్టు సమీపంలోని ఓ హోటల్కు వెళ్లారు. తన డివిజన్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు సంజయ్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఖైరతాబాద్ తెరాస అభ్యర్థి విజయారెడ్డి అక్కడికి చేరుకుని ప్రశ్నించారు. దీంతో సంజయ్ వెళ్లిపోయేందుకు యత్నించారు. ఆయన నగదుతో వచ్చి పంపిణీకి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ సంజయ్ వాహనాలను తనిఖీ చేయాలని విజయారెడ్డి డిమాండ్ చేశారు.
ఈలోపు తెరాస కార్యకర్తలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ జరిగే అవకాశముందని భావించిన పోలీసులు.. సంజయ్ను ఆయన వ్యక్తిగత వాహనంలో ముందుకు పంపించారు. దీనిపై తెరాస కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ వ్యక్తిగత వాహనం వెనుకనే పార్టీ కేటాయించిన వాహనాన్ని తెరాస శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో సంజయ్కు పార్టీ కేటాయించిన వాహనంపై తెరాస కార్యకర్తలు చేతులతోనే దాడి చేశారు. దీంతో ఆ వాహనం అద్దాలు పగిలిపోయాయి. దీంతో పోలీసులు కలుగజేసుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
బండి సంజయ్పై హత్యాయత్నం జరగలేదు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై హత్యాయత్నం జరగలేదని మధ్య మండల డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. బండి సంజయ్, భాజపా కార్యకర్తలు నెక్లెస్రోడ్డుకు రావడంతో, తెరాస నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి అనుచరులు సంజయ్ వాహనం అడ్డుకునే యత్నం చేశారని పేర్కొన్నారు. దీంతో బండి సంజయ్ అక్కడి నుంచి వెళ్లిపోయారని డీసీపీ తెలిపారు. అనంతరం భాజపా కార్యకర్తల కారు అద్దాలను ఇతర పార్టీల నేతలు ధ్వంసం చేశారని డీసీపీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు.