
15మంది దుర్గగుడి సిబ్బందిపై వేటు
ఏసీబీ తనిఖీల్లో గుర్తించిన లోపాలపై చర్యలు
ఈనాడు, విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఐదు రోజులపాటు కొనసాగిన అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తనిఖీలు, విచారణ సోమవారంతో ముగిశాయి. ఆలయంలోని కీలకమైన విభాగాలన్నింటినీ అధికారులు లోతుగా పరిశీలించారు. ఇక్కడ జరుగుతున్న అనేక లోపాలను గుర్తించిన అధికారులు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. నివేదిక ఆధారంగా పదిహేను మంది ఆలయ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ దేవాదాయశాఖ ప్రత్యేక కమిషనర్ పి.అర్జునరావు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఆరుగురు సూపరింటెండెంట్లు, తొమ్మిది మంది గుమాస్తాలను ఆలయ ఈవో సురేష్ సస్పెండ్ చేశారు. వేటు పడినవారిలో చీరలు, ప్రసాదాలు, అన్నదానం, స్టోర్ తదితర ఎనిమిది విభాగాలకు చెందిన ఉద్యోగులున్నారు. ఆలయంలోని లడ్డూ ప్రసాదాలు, టికెట్లు, చీరల కౌంటర్లు, టోల్గేట్, కేశఖండనశాల, ప్రొవిజన్ స్టోర్, ఇంజినీరింగ్ విభాగాల్లో అవకతవకలు జరిగినట్లు అనిశా అధికారులు నివేదికలో వెల్లడించారు.
సస్పెండ్ అయిన 15మంది సిబ్బంది..
1. కె.శ్రీనివాసరావు - ప్రసాదం తయారీ, చీరల విభాగం సూపరింటెండెంట్
2. కె.శ్రీనివాసమూర్తి - అన్నదానం విభాగం
3. ఎ.అమృతరావు - మెయిన్స్టోర్ సూపరింటెండెంట్
4. కె.హరికృష్ణ - మెయిన్స్టోర్ సూపరింటెండెంట్
5. పి. భాగ్యజ్యోతి - శానిటేషన్ సూపరింటెండెంట్
6. కూరెళ్ల శ్రీనివాసరావు - లీజుల విభాగం సూపరింటెండెంట్
7. జి.యశ్వంత్ - సీనియర్ అసిస్టెంట్, లీజుల విభాగం
8. బి.నాగేశ్వరరావు - సీనియర్ అసిస్టెంట్, చీరల విభాగం
9. సీహెచ్.చెన్నకేశవరావు - జూనియర్ అసిస్టెంట్, చీరల విభాగం
10.ఎం.ఎస్.ప్రకాశరావు - జూనియర్ అసిస్టెంట్, శానిటేషన్ విభాగం
11.పి.రవికుమార్ - దర్శనం టిక్కెట్ల రికార్డు అసిస్టెంట్
12.కె.రమేష్ - ఆర్జిత సేవల రికార్డు అసిస్టెంట్
13.పి.రాంబాబు - ఫొటో కౌంటరు రికార్డు అసిస్టెంట్
14.జె.ఏడుకొండలు - అటెండర్, ప్రసాదం టికెట్లు
15.రవిప్రసాద్ - సూపరింటెండెంట్