
తాజా వార్తలు
నాగేశ్వరరావుకు.. తెదేపాతో సంబంధాలపై ఆరా!
మంత్రి పేర్ని నానిపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం
విచారణ నిమిత్తం హాజరైన బడుగు ఉమాదేవి
భాస్కరపురం(మచిలీపట్నం): మంత్రి పేర్ని నానిపైౖ జరిగిన దాడి కేసులో నిందితుడు నాగేశ్వరరావుకు తెదేపాతో ఉన్న సంబంధాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. ఇప్పటికే ఈ కేసులో నిందితుడ్ని రిమాండ్కు తరలించిన పోలీసులు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడి సోదరితో పాటు.. మరో ముగ్గురిని మంగళవారం పోలీసులు విచారణ చేశారు. వీరంతా తెలుగుదేశం పార్టీ నాయకులు కావడంతో నగరంలో చర్చనీయాంశమైంది. తెదేపా సీనియర్ నాయకులైన మరకాని పరబ్రహ్మం, మాదిరెడ్డి శ్రీను, చిన్నం శివలతో పాటు, నాగేశ్వరరావు సోదరి బడుగు ఉమాదేవిని పోలీసులు విడివిడిగా ప్రశ్నించారు. నిందితుడు నాగేశ్వరరావు మీకు పరిచయస్తుడేనా.? మీకు అతనితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి.? మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వద్దకు తరచూ వస్తుంటాడా.? తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటాడా.? వంటి అంశాలపై ప్రశ్నలు అడిగి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. మళ్లీ బుధవారం ఉదయం 9 గంటలకు విచారణ కోసం పోలీసుస్టేషన్కు రావాలని చెప్పారు. మంత్రి పేర్ని ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. అర్జీలు ఇచ్చే వారితో పాటు.. ఇంటికి వచ్చే కార్యకర్తలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
కోర్టులో కస్టడీ పిటీషన్ దాఖలు
నిందితుడు నాగేశ్వరరావును విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి కోరుతూ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. బుధవారం దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది. అతన్నికస్టడీలోకి తీసుకుని విచారిస్తే ‘మంత్రిపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశాడా.? ఎవరైనా వెనుక ఉండి ప్రేరేపించారా.? లేదా అనుకోకుండా జరిగిందా.? అనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.