
తాజా వార్తలు
తుపాకీలతో బెదిరించి.. 25కిలోల బంగారం దోపిడీ
ముత్తూట్ ఫైనాన్స్లో పట్టపగలే భారీ చోరీ
హోసూర్: ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దొంగల ముఠా పట్టపగలే రెచ్చిపోయింది. తమిళనాడులోని హోసూరులో ఉదయం 9.30గంటల సమయంలోనే స్థానిక ముత్తూట్ ఫైనాన్స్లోకి చొరబడి భారీ చోరీకి పాల్పడింది. శుక్రవారం ఉదయం కార్యాలయం తెరుచుకున్న కొద్దిసేపటికి ఆరుగురు దుండగులు ఈ ప్రైవేటు బంగారు రుణాల ఫైనాన్సింగ్ సంస్థ కార్యాలయంలోకి చొరబడి 25కిలోలకు పైగా బంగారం ఎత్తుకెళ్లారు. దీని విలువ రూ.7.5కోట్లు ఉంటుందని అంచనా. దీంతో పాటు లాకర్లలో ఉన్న రూ.96వేల నగదు కూడా దోచుకెళ్లినట్టు ముత్తూట్ ఫైనాన్స్ సిబ్బంది తెలిపారు.
హోసూరు -బాగలూరు రోడ్డులో ఉన్న ముత్తూట్ కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగులు ముఖాలకు మాస్క్లు ధరించి హెల్మెట్లు పెట్టుకొని లోపలికి ప్రవేశించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్యూరిటీ గార్డును కొట్టి లోపలికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఐదుగురు సిబ్బంది, ముగ్గురు కస్టమర్లు ఉన్నారు. అయితే, దోపిడీకి ముందు మేనేజర్, నలుగురు సిబ్బందిని తుపాకీలతో బెదిరించి బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ బండి గంగాధర్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ దొంగల ముఠాను పట్టుకొనేందుకు పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు కోయబంత్తూర్ వెస్ట్ జోన్ ఐజీ కె.పేరయ్య తెలిపారు. కర్ణాటకకు పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నట్టు చెప్పారు. మూడు ప్రత్యేక బృందాలు బెంగళూరుకు వెళ్లాయని, మిగతా బృందాలు కూడా వారిని పట్టుకొనే పనిలో గాలిస్తున్నాయని పేర్కొన్నారు.