
తాజా వార్తలు
10శాతం కమీషన్ అన్నారు..కుచ్చుటోపీ పెట్టారు
ఆన్లైన్ మార్కెటింగ్ మోసాల ముఠా అరెస్ట్
మీడియాకు వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్
ప్రకటనలు చూసి మోసపోవద్దని సూచన
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ వేదికగా పెట్టుబడి, మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి సీపీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నర్సీపట్నంకు చెందిన నందకిషోర్, విశాఖపట్నంకు చెందిన భూమిరెడ్డి అవినాశ్రెడ్డి, చిట్టంరెడ్డి, తుళ్లూరు శ్రీనివాస్ ఓ బృందంగా ఏర్పడి యూకే ఆధారిత నకిలీ ‘స్కెమ్కార్ మాక్స్ హెడ్జ్’ పేరిట వెబ్సైట్, యాప్ను సృష్టించారు. విదేశీ బహుళజాతి సంస్థ తరహాలో మంచి సదాభిప్రాయం కల్పించడంతో కస్టమర్లు విశ్వసించారు. రూ.లక్ష డిపాజిట్ చేస్తే రోజూ 5 శాతం చొప్పున కమీషన్ ఇవ్వడం సహా 2 నెలల తర్వాత అసలు ఇస్తామంటూ నమ్మడంతో ఆకర్షితులయ్యారు.
లండర్ వర్చువల్ మొబైల్ వాట్సాప్ నంబర్లు ఏర్పాటు చేసి దాదాపు 2500 మంది నుంచి రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు డిపాజిట్లు సేకరించారు. ఇలా రూ.7కోట్ల వరకు ఆన్లైన్లో వసూలు చేసి కొన్ని రోజులపాటు కమీషన్ ఇచ్చారు. మరో కస్టమర్ను పరిచయం చేసి రూ.లక్ష డిపాజిట్ చేయిస్తే అదనంగా 10 శాతం కమీషన్ ఇస్తామంటూ ప్రలోభాలకు తెరతీశారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు పెట్టుబడి తర్వాత మోసపోయినట్లు గ్రహించారని సీపీ వివరించారు. డీసీపీ రోహిణి, ఏసీపీ బాలకృష్ణ, సీఐ సంజయ్కుమార్ నేతృత్వంలో కేసు నిగ్గుతేల్చినందుకు సీపీ వారికి అభినందనలు తెలిపారు. నిందితుల నుంచి 4 మొబైల్ఫోన్లు, ఒక సిమ్కార్డు, ఓ ఇంటి స్థలం పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. అయాచితంగా డబ్బులు వస్తు్న్నాయన్న ప్రకటనలు చూసి మోసపోవద్దని.. ఆయా సంస్థల విశ్వసనీయత, గత చరిత్ర చూడాలని సీపీ ప్రజలకు సూచించారు.